8వ అధ్యాయం – బుధ-గురువార వ్రత కథనం

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
శ్రీ స్కాందపురాణం పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.
కథ క్లుప్తముగా
ఈ అధ్యాయంలో ఈశ్వరుడు సనత్కుమారునికి శ్రావణ మాసంలో బుధ, గురువారాల్లో ఆచరించవలసిన వ్రతం గురించి వివరిస్తాడు. చంద్రుడు (Chandra)గురువు భార్య అయిన తారపై మోహంతో ఆమెను తన వద్ద ఉంచుకోగా, వారిద్దరికీ పుట్టిన కుమారుడే బుధుడు (Budha). ఈ విషయం తెలిసిన బృహస్పతి (Brhaspati), తారను తిరిగి ఇవ్వమని కోరినప్పటికీ చంద్రుడు అంగీకరించడు. ఈ వివాదాన్ని దేవేంద్రుడు (Devendra) పరిష్కరించడానికి ప్రయత్నించినా, బుధుడి విషయంలో చంద్రుడు, బృహస్పతి మధ్య తగాదా కొనసాగుతుంది. చివరకు బుధుడు చంద్రుని కుమారుడు అని తేలింది. అప్పుడు దేవతలు బుధ-గురువారాలను కలిపి వ్రతం ఆచరించిన వారికి సమస్త కార్యసిద్ధి కలుగుతుందని చెబుతారు. ఈ వ్రతంలో బుధుడు, బృహస్పతి ప్రతిమలను పూజించి, పెరుగు అన్నం, ముల్లంగి కూర నివేదన చేయాలని సూచిస్తాడు. ఈ వ్రతాన్ని ఏడు సంవత్సరాలు ఆచరించి ఉద్యాపన చేస్తే, కోరిన కోరికలు నెరవేరుతాయని శివుడు తెలియజేస్తాడు.
వ్రతం ఆచరించిన వారికి గృహం, ధనకొట్లు, వంటగది వంటి వివిధ ప్రదేశాలలో ప్రతిమలను ఉంచి పూజించడం ద్వారా ఆయా రంగాలలో శుభాలు కలుగుతాయని ఈశ్వరుడు వివరిస్తాడు. ఈ సందర్భంలో, ఒక మేనమామ, మేనల్లుడు దారిద్ర్యంతో బాధపడుతూ, ఒక పట్టణంలో ఈ వ్రతాన్ని చూసి, దానిని ఆచరించి గొప్ప ఐశ్వర్యాన్ని, పుత్ర పౌత్రాదులను పొందిన కథను చెబుతాడు. దీనికి సంతోషించిన బుధుడు, బృహస్పతి వారికి ప్రత్యక్షమై వరం ఇవ్వడమే కాకుండా, ఈ వ్రతాన్ని ఆచరించేవారు ముఖ్యంగా మేనమామను, మేనల్లుని భోజనానికి ఆహ్వానించి పూజించాలని ఆజ్ఞాపిస్తారని తెలియజేస్తాడు. ఈ వ్రతం ఆచరించినవారు ఇహలోక సుఖాలను అనుభవించి, చివరికి శివలోకం చేరుతారని శివుడు ఉద్ఘాటిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తాడు.
Shravana Masa Mahatmyam Day – 8
శ్రావణమాస మహాత్మ్యము – 8వ అధ్యాయం
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
🌻ఈశ్వరఉవాచ:
సాంబమూర్తి చెప్పుచున్నాడు…
బుధ గురు వారముల సంబంధమగు వ్రతములను జెప్పెదను వినుము. సమస్త పాపములను పోగొట్టు నట్టి యీ వ్రతములను శ్రద్ధగా ఆచరించిన మనుజుడు విశేషమైన కార్య సిద్ధిని పొందగలడు.
పూర్వము బ్రహ్మదేవుడు చంద్రుని ద్విజరాజు అని ఏర్పాటు జేసెను. అటువంటి చంద్రుడు ఒకానొక సమయమున రూపము, లావణ్యము, యౌవనము, మొదలగు గుణములచే సమస్త స్త్రీలను మించియున్నదియు తార అను పేరుచే ప్రసిద్ధికెక్కియున్న గురు భార్యను చూచిన వాడై దాని సౌందర్యాతశయం వలన మోహముజెంది, ఆమెను తన ఇంటికి తీసికొని వెళ్లి ఆమెతో కొంతకాలము సంభోగింపగా… ఆమె యందు చంద్రుని వలన ఒక పుత్రుడుదయించెను.
ఆ పిల్లవాడు సమస్త లక్షణములు గలవాడును, రూపము, విద్య మొదలగు వానిచే ప్రకాశింపుచు బుధుడు అను పేరుచే ప్రసిద్ధికెక్కి యుండెను. ఇట్లుండగా, బృహస్పతి తన భార్యను వెదకుచూ రాగా తారను చంద్రునియింట జూచి, ఓ చంద్రుడా! నేను నీకు గురువును కదా, నా భార్యను నీవు తీసుకొని రాతగునా! గురు భార్యతో సంభోగించిన వానికి ప్రాయశ్చిత్తము లేదుగదా!! ఓ చంద్రుడా! ఇట్టి మహా పాతకము జేయుటకు నీకు బుద్ధి ఎలాగు కలిగినది? కాబట్టి, నీకు గురు భార్యయు నాకు ప్రియురాలునగు తారను ఎవరికిని తెలియకమునుపే నాకిమ్ము, నీవు చేసిన పాపమునకు రహస్యముగానే ప్రాయశ్చిత్తము జేసికొని పవిత్రుడవు గమ్ము. ఆలాగున నీవు చేయని ఎడల నీవు చేసిన అపరాధమును దేవేంద్రునితో చెప్పెదను.
ఈ ప్రకారము బృహస్పతి అనేక విధములుగా చెప్పినప్పటికిని, చంద్రుడు తార యందు గల మోహముచే తారను ఇవ్వలేదు. అప్పుడు బృహస్పతి దేవసభకు వెళ్లి, ఈ వృత్తాంతము దేవేంద్రునితో ఈ విధముగా జెప్పెను.
ఓ ఇంద్రుడా! నా భార్యను చంద్రుడు అపహరించెను, నేను వెళ్లి నా భార్యను నాకిమ్మని ప్రార్థించినా ఇవ్వలేదు. కాబట్టి, నీవు దేవతలకందరికిని ప్రభువువు గనుక, నీ ఆజ్ఞ ప్రకారముగా నా భార్యను నాకిచ్చునట్లు చేయవలయును. ఆలాగున నీవు చేయని యెడల చంద్రుడు చేసిన పాపము నీవు పొందగలవు. ఎందువల్ల ననగా, లోకములో ప్రభువు, పాప పుణ్యములను విచారించి, దుష్కృతములు చేసినవారికి తగిన శిక్ష విధించవలయును. అట్లు చేయనిచో ఆ దేశ వాసుల పాపములను రాజు పొందగలడని శాస్త్రములు నిర్థారణ చేసి చెప్పుచున్నవి. మరియు బలము లేనివానికి రాజే బలమని పురాణముల యందు చెప్పబడుచున్నది.
ఈ విధముగా బృహస్పతి చెప్పిన మాటను దేవేంద్రుడు విని మిక్కిలి కోపము గలవాడై చంద్రుని పిలిపించి యిట్లు చెప్పెను. ఓ చంద్రుడా! ఇతరుల భార్యలతో సంభోగము చేసినను విశేష పాపము లేదు గాని గురు భార్యా సంభోము మహా పాపము, కాబట్టి నీవు విచారింపక బృహస్పతికి తార నిమ్ము.
ఇట్లు చెప్పిన దేవేంద్రుని మాటలను చంద్రుడునిని చెప్పుచున్నాడు. ఓ దేవేంద్రా! నీ ఆజ్ఞానుసారముగా బృహస్పతికి తారనిచ్చెదను, గాని, కుమారుడగు బుధుని ఇవ్వను. నా వలన కుమారుడు కలిగెను కాబట్టి నా వద్దనే ఉండవలెనని చంద్రుడు చెప్పెను. నా వలన కుమారుడు కలిగెను, కాబట్టి నా వద్దనే ఉండవలయునని బృహస్పతియు అనెను. ఇట్లు ఉభయులు వివాద పడుచుండగా, దేవతలకు సందేహం కలిగి ఇందు విషయమై యధార్థము తల్లికి తెలిసియుండును కాబట్టి ఆమె నడిగి నిర్ధారణ చేయదలచిన వారై తారను పిలచి, ఓ తారా! ఈ పిల్లవాడు ఎవరి వలన సంభవించెనో నిజము చెప్పమని దేవతలడుగగా, అప్పుడు తార సిగ్గును జెంది, ఆ పిల్లవాడు చంద్రుని వలన కలిగెనని పలికెను.
బృహస్పతి క్షేత్రము నందు పుట్టినవాడు గనుకను, చంద్రునకు వ్రసుడు గనుకను, ఎవరికి ఇవ్వవచ్చునని శాస్త్రము విచారించి, బుధుని చంద్రునకు ఇప్పించిరి.
అప్పుడు దేవతలు బుధుని చంద్రునకు ఇప్పించగా బృహస్పతి చిన్నబోయిన మనస్సు గలవాడాయెను. అప్పుడు దేవతలిట్లు చెప్పుచున్నారు. బుధుడా, నీవు చంద్రుని ఇంటికి వెళ్లుము, ఆయినను బుధుని విషయములో బృహస్పతికిని చంద్రునకును పుత్ర సంబంధము కలదని నుడివిరి.
ఓ బృహస్పతీ! మరియొకటి చెప్పెద వినుము. నిన్ను, బుధుని – మీ ఉభయులను గుఱించియు కలిపి వ్రతము జేసిన వానికి సమస్తమైన కార్య సిద్ధులు గలుగును సత్యము సందేహము లేదు.
సాంబమూర్తికి ప్రియకరమగు శ్రావణమాసములో ఎవడైనను, బుధ, గురు వారముల యందు బుధుని బృహస్పతి ఆకారములను మంటపము నందు వేరు వేరుగా పూజ చేసి, పెరుగుతో మిళితమైన అన్నమును, ముల్లంగి కూరయు నివేదనము చేసిన యెడల ఫలమును పొందగలడు. పిల్లలు తిరిగి సంచరించు నట్టి గృహము నందు వీరి ప్రతిమల నుంచి పూజించిన ఎడల సమస్త గుణ సంపత్తి కలవాడు దీర్ఘ ఆయువును కలుగునట్టి పుత్రులను పొందును. ధనకొట్ల యందు ప్రతిమనుంచి పూజించిన ఎడల ఎప్పుడు ధనము క్షీణింపక పొందుచుండును. వంట ఇంటి యందుంచి ప్రతిమలను పూజించిన ఎడల పాక వృద్ధియు, దేవతా గృహమందు జరిగిన ఎడల దేవతల అనుగ్రహమును కలుగును.
పడక ఇంటి యందుంచి పూజించిన ఎడల భార్యా వియోగమెన్నడును సంభవింపదు. ధాన్యకొట్ల యదుంచి పూజించిన ఎడల ధాన్య వృద్ధి కలుగును. మరియు ఏయే కోరికలను ఉద్దేశించి పూజించినా అవియన్నియు సఫలమగును. ఇట్లు ఏడు సంవత్సరములు వ్రత మాచరించి పిమ్మట ఉద్యాపనము చేయవయును.
ఒక బంగారపు ప్రతిమను జేయించి, దానిని పగలు షోడశోపచారములచే పూజించి, రాత్రి జాగరణము చేసి, మరునాడు ఉదయము స్నానము జేసి పరిశుద్ధుడై అగ్ని ప్రతిష్ఠాపనము చేసి నువ్వులు, నెయ్యి, అన్నము, ఉత్తరేణి (Uttareni), రావి (Raavi), సమిధలు మరియు ఇతర సమిధల చేతను యధావిధిగా హోమము జేసి, అనంతరము పూర్ణాహుతి గావించి, బంధువులను మేనల్లుడు మేనమామ మొదలగు వారిని ఇతరత్రా బ్రాహ్మ ణులను భుజింపజేసి తానును భుజింపవలయును. ఇట్లు ఏడు సంవత్సరములు ప్రతమును చేసినవారు సమస్త కోరికలను పొందగలరు.
విద్యను కోరి వ్రతమును జేసిన ఎడల వేద (Veda) శాస్త్రార్థములను దెలిసినవాడగును బుధుని పూజించుటవలన గౌరవము కలవాడునగును.
🌻సనత్కుమార ఉవాచ:
ఓ భగవంతుడా! మేనమామను మేనల్లుని భుజింపజేయవలయునని చెప్పితివి. దానిని చెప్పుటకు వీలుండు నేని దానికి కారణము సహేతుకముగా చెప్పవలయును అని సవత్కుమారుడు అడిగెను.
🌻ఈశ్వరువాచ:
సాంబమూర్తి చెప్పుచున్నాడు…
ఓ మునీశ్వరా! పూర్వకాలమున బ్రాహ్మణులును, దీనులు-దరిద్రులై ఉదర పోషణార్ధమై చాలా కష్టపడుచుండి మేనమామ మేనల్లుడును ఇద్దరు కలరు. వారిద్దరు ఒకానొక సమయంబున శ్రావణమాసములో ఒక మనోహరమగు పట్టణమునకు యాచనచే ధాన్యమును సంపాధించుటకు వెళ్లగా ఆ ఊరిలో ప్రతి గృహమందును బుధ-గురువార వ్రతములనే జూచుచుండిరి.
అప్పుడు వారు ఇట్లు అనుకొనిరి – అన్ని వారములను గుఱించి ప్రతిములను జూచితిమి కాని బుధ-గురువార వ్రతములను ఎచ్చటను జూడలేదు, ఇక్కడ ప్రతి ఇంటను ఆచరించుచుండిరి, కాబట్టి, మనమును శ్రేష్ఠంబగు ఈ వ్రతమును ఆచరింపవలయునని అన్యోన్యమనుకొనిరి. గాని, ఆ వ్రతవిధానము తెలియక, సందేహము కలవారైరి.
అప్పుడు, ఆ రాత్రియందు భగవంతుని అనుగ్రహము వలన స్వప్నములో ఆ వ్రత విధానమంతయు గోచరమయ్యెను. అప్పుడు వారిరువురు వ్రతమును ఆచరించినవారై విశేషముగు ఐశ్వర్యమునొందిరి. ఆ సంపత్తియును దిన దినము వృద్ధియగుచుండెను. ఇట్లు ఏడు సంవత్సరములు ఆచరించిన వారలై పుత్రులు పౌత్రులు మొదలగు సమస్త సంపత్తులు కలవారైరి. బుధగురు వార వ్రతములను ఆచరించి భూలోకములో వ్యాపింపజేయుట వలన బుధుడును బృహస్పతియు సంతసించి వారికి ప్రత్యక్షమై వరములనొసగిరి,
ఓ మునీశ్వరా! ఇట్టి వృత్తాంతము జరిగినది కాబట్టి, ఇది మొదలుకొని బుధ-గురువార వ్రతములను ఆచరించు వారు మేనమామను మేనల్లుని ముఖ్యముగా భుజింపజేయవలయునని బుధ గురువులు చెప్పిరి. ఈ వ్రతమును ఆచరించుట వలన సమస్త కోరికలనుపొంది, జన్మానంతరమున నా లోకమునకు వచ్చి సూర్యచంద్రులు (Surya Chandra) ఉండునంత కాలము నా లోకములో నివసింతురు.
ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే బుధ-గురువార వ్రత కథనం నామ అష్టమోధ్యాయ సమాప్తం.
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏
Also Read
- Shravana Masa Mahatmyam – Day 1 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 2 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 3 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 4 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 5 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 6 | శ్రావణమాస మహాత్మ్యము