3వ అధ్యాయం – శ్రావణ శుద్ధ తదియ స్వర్ణగౌరీ వ్రతము

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
శ్రీ స్కాందపురాణం పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.
కథ క్లుప్తముగా
ఈ అధ్యాయంలో, ఈశ్వరుడు సనత్కుమారునికి శ్రావణ శుద్ధ తదియ నాడు ఆచరించవలసిన స్వర్ణగౌరీ వ్రతం గురించి వివరిస్తాడు. ఈ వ్రతంలో పార్వతీ పరమేశ్వరులను షోడశోపచారాలతో పూజించి, వ్రతం సంపూర్ణత కొరకు 16 వాయనాలను సువాసినులైన దంపతులకు నూతన వస్త్రాలతో సహా సమర్పించాలని చెబుతాడు. ఈ వ్రతాన్ని 16, 8, 4, లేదా కనీసం 1 సంవత్సరం పాటు ఆచరించి, ఆపై ఉద్యాపన చేసుకోవాలని సూచిస్తాడు. పూర్వం ఈ వ్రతం చంద్రప్రభుడనే రాజు మరియు అతని భార్యల కథ ద్వారా మహిమను పొందిందని, రాజు వేటకి వెళ్ళినప్పుడు ఒక దేవతల కొలను వద్ద అప్సరసలు ఈ వ్రతం చేయడం చూసి, వారి సలహా మేరకు ఆచరించగా, దాని ప్రభావంతో పొందిన శుభాలను, వ్రతం ఉల్లంఘించిన పెద్ద భార్యకు కలిగిన కష్టాలను, ఆపై గౌరీదేవి (Gouri Devi) అనుగ్రహంతో ఆమె తిరిగి వ్రతం ఆచరించి సుఖపడటాన్ని ఈశ్వరుడు వివరిస్తాడు.
స్వర్ణగౌరీ వ్రతం (Swarna Gauri Vrat) చేసిన వారికి సమస్త సంపదలు కలిగి, శత్రువులపై విజయం సాధించి, కైలాసం చేరుతారని శివుడు ఉద్ఘాటిస్తాడు. చివరగా, ఈశ్వరుడు స్వర్ణగౌరీ వ్రత ఉద్యాపన విధానాన్ని వివరిస్తాడు. శుభ ముహూర్తంలో మంటపాన్ని ఏర్పాటు చేసి, అష్టదళ పద్మాన్ని చిత్రించి, ధాన్యరాశిపై నువ్వులతో నిండిన రాగి కలశాన్ని ఉంచి, దానిపై పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు చేయాలి. రాత్రి జాగరణ చేసి, మరుసటి రోజు ఉదయం నవగ్రహ (Navagraha), ప్రధాన దేవతా హోమాలు నిర్వహించి, శక్తి కొలది ఆచార్యులకు, 16 మంది దంపతులకు దానాలు ఇచ్చి, బ్రాహ్మణులకు భోజనం పెట్టి, బంధువులతో కలిసి భుజించాలని సూచిస్తాడు. ఈ విధంగా స్కాంద పురాణంలో శ్రావణ మాసంలో ఆచరించాల్సిన స్వర్ణగౌరీ వ్రతం, దాని మహిమ, ఉద్యాపన విధి గురించి వివరించబడింది.
Shravana Masa Mahatmyam Day – 3
శ్రావణమాస మహాత్మ్యము – 3వ అధ్యాయం
🍃🌷శ్రావణ శుద్ధతదియ స్వర్ణగౌరీ వ్రతము:
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
🌻ఈశ్వర ఉవాచ:
సాంబమూర్తి చెప్పుచున్నాడు…
ఓ సనత్కుమారుడా! ఇక ముందు శుభప్రదమగు స్వర్ణగౌరీ వ్రతము గూర్చి చెప్పెదను వినుము. ఆ వ్రతము శ్రావణ శుద్ధ తదియ యందు చేయవలయును. ఉదయమున స్నానం చేసి, సంధ్యావందనాది నిత్యకృత్యములను నెరవేర్చుకొని, సంకల్పము చేసి, పార్వతీ పరమేశ్వరులను షోడశోపచారములచే పూజ చేయవలయును.
ప్రపంచమునకు ప్రభువును దేవతలలో ఉత్తముడవు అగు, ఓ సాంబమూర్తీ! నేను చేయునట్టి పూజను గ్రహించుము, నేను జేయు పూజా స్థలమునకు వచ్చి నివశింపుమని ప్రార్థించవలెను. మహా దేవియగు పార్వతీ దేవి (Goddess Parvati Devi) యొక్క తృప్తి కొరకును, వ్రతం సంపూర్తినొందుటకును, పదహారు వాయనములను దంపతులకు ఇవ్వవలెను.
బ్రాహ్మణులు సంతోషించుట కొరకు వాయనములను ఇచ్చుచున్నానని సంకల్పం చేసి, బ్రాహ్మణులను పిలచి, వేపుడు బియ్యం, పదహారు పిండి వంటలతో నిండియున్నవియు, నూతన వస్త్రములతో జుట్టబడినవియు, పదహారు వెదురు పాత్రలను వ్రతం సంపూర్తినొందుటకు సర్వాలంకార భూషితులును పతివ్రతలు అగు సువాసినీ స్త్రీలకు ఇచ్చుచున్నాను, నా కార్య సమృద్ధి నిమిత్తమై వారు గ్రహింతురుగాక, అని ఇవ్వవలయును.
ఇట్లు పదహారు సంవత్సరములు గాని ఎనిమిది సంవత్సరాలు గాని, నాలుగు సంవత్సరాలు గాని, ఒక్క సంవత్సరం గాని, తత్కాలమందుగాని, చేసి పిమ్మట ఉద్యాపనం చేయవలెను. పూజ చేసిన పిమ్మట కథను చెప్పిన వానిని పూజింపవలెను.
🌻సనత్కుమార ఉవాచ:
ఓ స్వామ! యీ వ్రతమును పూర్వం చేసినవారెవరు, దీని మహిమ ఎటువంటిది, ఉద్యాపనం చేయు విధము ఎట్టిది – దీనినంతయు సవిస్తరంగా చెప్పుమని సాంబమూర్తిని సనత్కుమారుడు అడిగెను.
🌻ఈశ్వర ఉవాచ:
సాంబమూర్తి చెప్పుచున్నాడు…
ఓ మునీశ్వరా! నీవు వేసిన ప్రశ్న యోగ్యంగా ఉన్నది. కాబట్టి, దాని వివరము అంతయు నీకు చెప్పెదను వినవలయును. స్వర్ణగౌరీ వ్రతం మనుష్యులకు సమస్త సంపదలనిచ్చును.
పూర్వ కాలంబున సరస్వతీ నదీ తీరంబున సువిలమను ఒక పట్టణం కలదు. ఆ పట్టణంబున కుబేరునితో (Kubera) సమాన సంపదగల చంద్ర ప్రభుడను ఒక రాజు, ఆ రాజునకు సౌందర్యంచే మన్మధుని తిరస్కరించు నట్టి రూప లావణ్యం కలవారును, పద్మముల వంటి నేత్రములు కలవారును, మహాదేవి, విశాల అను పేర్లుగల ఇద్దరు భార్యలు కలరు. ఆ రాజు, వారిరువురిలో పెద్ద భార్య యందు మిక్కిలి ప్రేమ గలవాడై యుండెను.
ఆ రాజు ఒకనాడు వేటాడుటయందు ఆసక్తి గలవాడై అడవికి వెళ్లి కౄర మృగములగు సింహములను, పెద్ద పులులను, అడవి పందులను, అడవి దున్నలను, ఏనుగులను, సంహరించి, అలసినవాడై దప్పికచే పీడింపబడి జలం నిమిత్తమై ఆ అడవి అంతయు తిరిగెను.
పద్మముల వంటి నేత్రములు గల ఆ రాజు ఇట్లు వనమంతయు తిరుగగా చక్రవాకములు, కారండవములు, తుమ్మెదలు, కోయిలలు, మొదలగు పక్షులతో వ్యాప్తమైనదియు, వికసించిన పద్మములు (Lotus), మల్లెలు, జాజులు, తెల్ల కలువలు, నల్ల కలువలు, మొదలగు పుష్పములతో నిండియున్నదియు, మనోహరమగు ఒక దేవతల కొలను కనుపింపగా దానివద్దకేగి, జలమును పానముచేసి ఒడ్డున భక్తితో పార్వతీ దేవిని (Parvati Devi) పూజింపుచున్న అప్సర స్త్రీలను జూచి మీరు చేయుచున్న వ్రతమేమి!? అని ఆ స్త్రీలను అడిగెను. ఓ రాజా! మేము చేయునది, స్వర్ణగౌరీ వ్రతము. శ్రేష్ఠమైనది. మనుష్యులకు సమస్త సంపదలనొసగును. కాబట్టి, నీవును ఈ వ్రతమును చేయమని ఆ స్త్రీలు చెప్పిరి.
🌻రాజోవాచ:
ఈ వ్రతమును ఏ విధిగా చేయవలయును, చేసినందు వలన ఫలమేమి కలుగును, దీనినంతయు స విస్తరముగా చెప్పుమని రాజు ప్రశ్న చేయగా, ఆ అప్సర స్త్రీలు చెప్పుచున్నారు….
శ్రావణమాసములో తదియ దినంబున ఈ స్వర్ణగౌరీ వ్రతమును చేయవలయును. ఈ వ్రతమునందు పార్వతీ పరమేశ్వరులను మిక్కిలి భక్తి కలిగి సంతోషముతోగూడి పూజింపవలయును. అనంతరము పదహారు పోగులు పోసిన తోరమును మగవాడు కుడి చేతికిని, స్త్రీలు ఎడమ చేతికిని కట్టుకొనవలెను. లేక తోరమును కంఠమునందైనను ధరింపవచ్చును. అని స్త్రీలు చెప్పిరి. అనంతరము ఆ రాజు నియమముగల మనస్సుతో గూడినవాడై, ఆ స్వర్ణగౌరీ వ్రతమును చేసి పదహారు పోగులు గల తోరమును కుడిచేతికి కట్టుకొని దేవతలలో ఉత్తమురాలవగు ఓ గౌరీ! నీ వ్రతమును చేసి తోరమును గట్టుకొంటిని కాబట్టి నాయందు అనుగ్రహము కలదానివగుమని ప్రార్థించి, వ్రతమును పూర్తిచేసి యింటికి వెళ్లెను.
ఆ రాజు ఇంటికి వెళ్లగానే కుడి చేతినున్న తోరమును జూచి పెద్ద భార్య మిక్కిలి కోపము కలదగుచు, రాజు వలదు వలదు అన్ననూ.. వినక, రాజు చేతి నుండెడి తోరమును తెంచివేసి యింటికి వెలుపల ఉండెడి ఎండిన చెట్టు మీద పారవేయగా, ఆ చెట్టుకు తోరము తగిలినంతనే ఆ చెట్టు చిగుళ్లు పువ్వులు కలదాయెను. ఇది యంతయు రెండవ భార్య చూచి, మిక్కిలి ఆశ్చర్యముకలదై వ్యాకులతను చెంది, తెగిపోయి అక్కడ పడియున్న తోరమును తీసుకొని తన హస్తమునకు కట్టుకొనగా, ఆ వ్రత మహిమ వలన ఆ రెండవ భార్య యందు మిక్కిలి ప్రేమం గలవాడాయెను.
వ్రతమును ఉల్లంఘన చేయుటచే రాజు కోపించి పెద్ద భార్యను వెళ్ళగొట్టగా.. ఆమె అడవుల యందు దిరుగుచు, దేవిని ప్రార్థించుచు, అక్కడక్కడ కనపడిన మునుల ఆశ్రమములకు పోగా, వారు ఓ పాపాత్మురాలా! అడవులందు ఏల తిరిగెదవు, ఇంటికి పొమ్ము అని పలికినప్పటికి వినక, మహా ఘోరమగు ఆ అడవియందే తిరుగుచు, అలసి, విచారపడుచు ఒకచోటున కూర్చుండెను.
అనంతరము గౌరీదేవి ఆ రాజు యొక్క భార్యయందు దయ కలిగి, ఎదుట ప్రత్యక్షము కాగానే, ఆ రాజు భార్య గౌరీ దేవిని చూచి సాష్టాంగ దండ ప్రణామము చేసి, ఓ దేవీ! భక్త వరదే! శంకరవామాంగే! మంగళ మంగళే! నీకు నమస్కారము అని ఈ ప్రకారము ప్రార్థించి, ఆ గౌరీదేవి (Gouri Devi) వలన స్వర్ణగౌరీ వ్రతమును తెలిసికొని, భక్తితో యధావిధిగా ఆచరింపగా, గౌరీదేవి సంతోషించి వరములనిచ్చెను. అనంతరము ఆమె ఇంటికి వెళ్లగా, వ్రత మహిమచే తన భర్త తిరిగి తనయింటనుంచుకొని పూర్వము వలెనే ప్రేమతో నుండెను.
అనంతరము ఆ రాజు పెద్ద భార్య గౌరీదేవి యొక్క అనుగ్రహము వలన సమస్త కోరికలను పొందెను. ఇట్లు ఆ రాజు ఇద్దరు భార్యలయందు సమాన ప్రేమ గలవాడై, సమస్త సంపదలను అనుభవించి కొంతకాలము రాజ్యము చేసి, అంత్యకాలమందు ఆ ఇద్దరు భార్యలతో కూడా కైలాసము చేరెను.
ఓ మునీశ్వరుడా! శుభప్రదమగు ఈ స్వర్ణగౌరీ వ్రతమును చేసినవాడు నాకు, గౌరీ దేవికిని ప్రియమైనవాడగుచు విశేషమగు సంపదను పొంది శత్రువులందరినీ జయించి శ్రేష్ఠంబగు శివుని (Lord Shiva) నివాస స్థానమైన కైలాసమును జేరుదురు.
ఓ మునీశ్వరుడా! ఈ స్వర్ణగౌరీ వ్రతమునకు ఉద్యాపన విధానమును చెప్పెదను, సావధానముతో వినుము. యోగ్యమైన తిథి వారములు గల దినమందు తారాచంద్ర బలయుక్తముగా ఉండునప్పుడు, చేయదలచినవాడై మంటపము నేర్పరచి అష్ట దళములు గల పద్మమును లిఖించి, అచ్చట ధాన్యమును రాశిగా బోసి దానిపైన పదహారు నవటాకుల యెత్తుగల రాగి కలశమును నువ్వులతో నిండించి యందుంచి, దానిపైన పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలనుంచి, వేదోక్త మంత్రములచే ఆవాహనాదులను గావించి, రెండు తెల్లని వస్త్రములను, యజ్ఞోపవీతములను ఉంచి, యధావిధిగా పూజనంతయు గావించి, ఆ రాత్రి జాగరణము చేయవలెను.
అనంతరము మరునాడు ఉదయమున ప్రాతఃకాల పూజ గావించి, ముందుగా నవగ్రహ హోమము చేసి, పిమ్మట ప్రధాన దేవతకు హోమము చేయవలెను. నువ్వులు బియ్యము నెయ్యి కలిపి హోమంచేసి, ధనవంతుడైనచో, విశేషముగా చేయవలెను, లేక వెయ్యి పర్యాయములు గాని, నూరు పర్యాయములు గాని హొమము చేసిన పిమ్మట ఆచార్యునకు వస్త్రములు, ఆభరణములు ఆవులు మొదలగువానిని పూజించి ఇచ్చి, పదహారుగురు దంపతులకు వాయన దానమిచ్చి, పిమ్మట బ్రాహ్మణులను భుజింపజేసి, తన శక్తి కొలది, వారికి విశేష దక్షిణలను ఇచ్చి, ఆనందముతో గూడినవాడై, బంధువులతో కూడ అనంతరము తాను భుజింపవలయునని సాంబమూర్తి, సనత్కుమారునితో చెప్పెను.
ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే – తృతీయా తిథౌ స్వర్ణగౌరీ వ్రత కథనం నామ తృతీయోధ్యాయ స్సమాప్తః|
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏