13వ అధ్యాయం – దూర్వాగణపతి వ్రత కథనం

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
శ్రీ స్కాందపురాణం పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.
కథ క్లుప్తముగా
ఈ అధ్యాయంలో ఈశ్వరుడు (Eshwar) సనత్కుమారునికి శ్రావణ శుద్ధ చవితి (Chaviti) నాడు ఆచరించవలసిన “దూర్వా గణపతి వ్రతం” గురించి వివరించాడు. ఈ వ్రతం మూడు లోకాలలో ప్రసిద్ధి చెందిందని, పార్వతీదేవి, సరస్వతి (Goddess Saraswati), ఇంద్రుడు, విష్ణువు (Lord Vishnu) వంటి దేవతలు సైతం దీనిని ఆచరించారని శివుడు తెలియజేస్తాడు. ఈ వ్రతంలో బంగారంతో చేసిన ఏకదంతుడైన విఘ్నేశ్వరుని (Lord Vigneswara) ప్రతిమను బంగారు (Gold) గరికల మీద ఉంచిన పీఠంపై నెలకొల్పాలని సూచించాడు. అనంతరం ఎర్రని పుష్పాలు, ఉత్తరేణి, జమ్మి, గరిక, తులసి (Tulsi) వంటి ఐదు రకాల పత్రాలతో వినాయకుడిని షోడశోపచారాలతో పూజించాలని వివరించాడు. కుడుములు, ఉండ్రాళ్ళు, పండ్లు వంటి నైవేద్యాలను సమర్పించి, ఈ వ్రతాన్ని ఐదు లేదా మూడు సంవత్సరాలు చేయాలని చెబుతాడు.
వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన చేయాలని, లేకపోతే వ్రతఫలం దక్కదని శివుడు హెచ్చరిస్తాడు. ఉద్యాపన సమయంలో బంగారంతో చేసిన గణపతి (Lord Ganapati) ప్రతిమను ఆచార్యునికి దానంగా ఇవ్వాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి ఇహలోకంలో సమస్త కోరికలు నెరవేరి, మరణానంతరం కైలాస ప్రాప్తి లభిస్తుందని శివుడు పేర్కొంటాడు. దూర్వాలు (గరిక) ఎలా శాఖలుగా విస్తరిస్తాయో, అలాగే ఈ వ్రతం ఆచరించిన వారికి పుత్ర, పౌత్రాదులతో వంశాభివృద్ధి కలుగుతుందని ఈశ్వరుడు తెలియజేస్తాడు. ఈ అత్యంత రహస్యమైన, శ్రేష్ఠమైన వ్రతం గురించి సనత్కుమారునికి మాత్రమే చెప్పానని శివుడు ఉద్ఘాటిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తాడు.
Shravana Masa Mahatmyam Day – 13
శ్రావణమాస మహాత్మ్యము – 13వ అధ్యాయం
♦️త్రయోదశాధ్యాయము:
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
🌻సనత్కుమార ఉవాచ:
ఓ భగవంతుడా! మనుష్యుడు ఏ వ్రతమును చేసిన అమితమగు సౌభాగ్యమును, పుత్రులను పౌత్రులను, ధనమును ఐశ్వర్యమును పొందునో, వ్రతములలో శ్రేష్ఠమైనటువంటి వ్రతమును చెప్పుమని సనత్కుమారుడు సాంబమూర్తి నడిగెను.
🌻ఈశ్వర ఉవాచ:
సాంబమూర్తి చెప్పుచున్నాడు…
మునీశ్వరుడా! దూర్వా గణపతి అను ఒక వ్రతము మూడు లోకముల యందు ప్రసిద్ధికెక్కియున్నది ఆ వ్రతము పూర్వంబున పార్వతీదేవి, సరస్వతి, ఇంద్రుడు, విష్ణువు, కుబేరుడు, మొదలగు వారిచే శ్రద్ధతో చేయబడినది, మరియు ఇతర దేవతులు, మునీశ్వరులు, గంధర్వులు, కింకరులు మొదలైన వారి చేతను ఆచరింపబడి యున్నది.
శ్రావణ మాసములో చవితి తిథి, విద్ధ మొదలగు దోషములు లేక పూర్ణముగానుండునది, పుణ్య ప్రదమైనది గాన ఆ దినంబున సమస్త పాపములను పోగొట్టు నట్టి దూర్వాగణపతి వ్రతమును చేయవలయును.
ఒక దంతము పెరికివేయుటచే, ఒక్క దంకముతో ఒప్పుచుండెడి విఘ్నేశ్వరుని యొక్క బంగారపు ప్రతిమను బంగారపు పీఠము నందు ఉండునట్లుగా అట్టి పీఠమును బంగారపు గరికెల మీద నుండునట్లు గాను చేయించి, అట్టి విఘ్నేశ్వరుని ప్రతిమను ఎర్రని వస్త్రములచే చుట్టబడిన రాగి కలశము నందుంచి, ఆ కలశము సర్వతోభద్రము అనెడు మండలమును లిఖియించి, దానియందుంచవలెను. అనంతరం ఎర్రని పుష్పములతోను, ఉత్తరేణి, జమ్మి, గరిక, తులసి దళములు, మొదలగు ఐదు విధములగు పత్రముల చేతను మరియు ఇతరరమైన సువాసనలు గల పుష్పముల చేతను పూజింపవలెను.
అనంతరము ఫలములు ఉండ్రాళ్ళు, భక్ష్యములు మొదలగునవి ఫలహారములుగా సమర్పించి, యధావిధిగా షోడశోపచారముల చేత వినాయకుని పూజ చేయవలయును.
బంగారపు ప్రతిమ యందు వినాయకుని యథావిధిగా ఆవాహనం చేసితిని కాబట్టి, దయా సముద్రుడవగు విఘ్నేశ్వరుడు వచ్చి, ఈ ప్రతిమ యందు నివసించు గాక. రత్నస్థకితమైన ఈ బంగారపు సింహాసనమును కూర్చుండుటకు ఉంచితిని కాబట్టి, విఘ్నేశ్వరుడు గ్రహించుగాక. పార్వతీదేవి కుమారుడును, విశ్వవ్యాపకుడును, సనాతనుడునగు ఓ విఘ్నేశ్వరా! నా సమస్త విఘ్నములను పోగొట్టుము నీకు పాద్యమును ఇచ్చుచున్నాను గ్రహింపుము.
దేవుడును, పార్వతీ దేవి కుమారుడును, బ్రహ్మ స్వరూపుడునగు గణాధిపతికి అర్ఘ్యమును ఇచ్చుచున్నాను, ఓ భగవంతుడా ! నీవు గ్రహింపుము. శూరుండును, వరదుడును అగు వినాయకునకు నమస్కారము. ఓ వినాయకా! నాచే ఇవ్వబడు ఈ ఆచమనమును నీవు గ్రహింపుము.
దేవోత్తమా ! గంగాది (Ganga River) సమస్త నదులను ప్రార్థించి తీసికొని రాబడిన జలమును స్నానార్థము ఇచ్చితిని, కాబట్టి గ్రహింపుము. సిందూరము కుంకుమచే అలంకరింపబడిన వస్త్రములను ఇచ్చితిని. కాబట్టి, ఓ వినాయకా! నీకు నమస్కారము చేసెదను గ్రహింపుము.
దేవుండును, సమస్త విఘ్నములను పోగొట్టువాడును, లంబోదరుడు అగు పార్వతీదేవి కుమారునకు గంధమును ఇచ్చితిని, కాబట్టి గ్రహించుగాక! ఓ దేవోత్తమా! ఎర్రని గంధముతో మిశ్రితములగు అక్షతలను భక్తితో ఇచ్చితిని కాబట్టి వానిని గ్రహింపుము.
సంపంగి పుష్పములు, మొగలి పుష్పములు, దాసాని పుష్పములు, మొదలగు వానిచే పార్వతీదేవి కుమారుని పూజ చేయుచుంటిని కాబట్టి నా యందు అనుగ్రహముంచు గాక! లోకములను రక్షించుటకును రాక్షసులను సంహరించుటకును అవతరించిన కుమారస్వామికి అన్నయగు వినాయకుడు (Lord Ganesha) నాచే ఇవ్వబడిన ధూపమును సంతోషముతో గ్రహింపుగాక!
పరంజ్యోతి స్వరూపుడును సమస్త సిద్ధులను ఇచ్చువాడును, మహాదేవ స్వరూపుడును అగు నీకు దీపమును సమర్పించుచున్నాడను, కుడుములు పరమాన్నం, లడ్లు మొదలగు భక్ష్యములతో గూడిన నాలుగువిధములైన అన్నముతో గూడ. (గణానాంత్వా) అను మంత్రం చెప్పి, నీకు నివేదనం చేయుచున్నాను.
ఓ వినాయకా! కర్పూరం, లవంగములు, ఏలకులు, పోక చెక్కలు, తమలపాకులు మొదలగువానితో గూడిన తాంబూలమును ముఖము నందు సువాసకొరకు ఆదరముతో నీకు ఇచ్చుచున్నాను.
ఓ వినాయకా! బ్రహ్మ యొక్క హృదయమందు ఉన్నదియు, అగ్నికి కారణమైన బంగారపు దక్షిణను ఇచ్చుచుంటిని కాబట్టి, నాకు శాంతిని కలుగ జేయుము. పార్వతీదేవి (Parvati devi) యొక్క కుమారుడును ఏనుగు ముఖము కలవాడును గణాధిపతియునగు ఓ విఘ్నేశ్వరా! నీ అనుగ్రహము వలన, నేను చేసిన వ్రతము సంపూర్ణమైనది యగుగాక!
ఈ ప్రకారము తో శక్తి కొలది విఘ్నేశ్వరుని పూజించి, ఆ విఘ్నేశ్వర ప్రతిమను అక్కడ ఉంచబడిన యావత్తు ద్రవ్యముతో కూడ ఆచార్యునకు దానపూర్వకముగా సమర్పించవలెను.
భగవత్స్వరూపుడవగు ఓ బ్రాహ్మణోత్తమా! దక్షిణ సహితముగా నేనిచ్చునట్టి విఘ్నేశ్వర ప్రతిమను గ్రహింపుము, మీ వచన ప్రకారముగా, నే చేసిన వ్రతము సంపూర్ణము నొందుగాక అని దానమివ్వవలయును. ఈ ప్రకారము ఐదు సంవత్సరములు వ్రతము చేసి, పిమ్మట ఉద్యాపనము చేసిన యెడల, ఈ లోకంబున సమస్త కోరికలను అనుభవించి దేహాంతమందు కైలాసమును పొందును, లేక మూడు సంవత్సరములు చేసినను సమస్త కోరికలను పొందును. ఉద్యాపనం చేయక, వ్రతము మాత్రమునే చేసిన ఎడల వాడు యధావిధిగా చేసినను, వ్రతము నిష్ఫలమగును.
కాబట్టి, ఉద్యాపన దినము నందు ఉదయమున నూనెతో తలంటి పోసుకొనవలెను. విద్వాంసుడు నవటాకు గాని, దానిలో సగముగాని, నాల్గవ వంతు గానీ, బంగారముతో విఘ్నేశ్వర ప్రతిమను చేయించి, పంచగవ్యములలో స్నానం చేయించి, గరికలు మొదలగువానితో పూజింపవలెను. ముందు చెప్పబడెడు పది మంత్రముల చేతను ప్రతి మనుష్యుడును శ్రద్ధగా పూజింపవలెను.
గణాధీశ, ఉమాపుత్ర, అఘనాశన, వినాయక, ఈశపుత్ర, సర్వసిద్ధి ప్రదాయక, ఏకదంత (Ekadanta), ఇభవక్త్ర, మూషక వాహన, కుమారగురో నీకు నమస్కారము అని ఈ పది నామముల చేతను వేరువేరుగా పూజింపవలయును. పూర్వ దినము నందు మంటపారాధనము చేసి, మరునాడు ఉదయమున గరికలు, కుడుములు మొదలగువానిచే గ్రహములకును, ప్రధాన దేవతలకును హోమము చేసి అనంతరం పూర్ణాహుతిని గావించి, పిమ్మట ఆచార్యుడు మొదలగువారిని పూజింపవలెను.
ఓ చిన్నవాడా! కడవతో సమానమగు పొదుగు గలదియు, దూడ గలదియు అగు ఆవును గోదానమును, మరియు తన శక్తి కొలది ఇతర దానములను చేయవలయును. ఇట్లు వ్రతమును చేసిన ఎడల సమస్త కోరికలనుపొందును. నాకు ప్రియమైన కుమారుడగుట వలన గణపతి (Ganapati) వ్రతం చేయుటచే నేను సంతోషించి, భూలోకమునందు ఉండునంతకాలము సమస్త భోగములనిచ్చి, అంత్యకాలమునకు కైలాస మిచ్చెదను.
దూర్వములు వాటివాటికి శాఖలచే ఏ రీతిగా వృద్ధి పొందునో.. ఆ రీతిగానే, దూర్వాగణపతి వ్రతమును చేసినవాడు పుత్రులు పౌత్రులు. మొదలగు సంతానంచే వంశవృద్ధి గలవాడగును.
ఓ మునీశ్వరుడా! రహస్యముగా ఉండునట్టిదియు, మిక్కిలి శ్రేష్ఠమైన దూర్వా గణపతి వ్రతమును గూర్చి నీకు చెప్పితిని. ఇట్టి వ్రతమును సుఖమును అపేక్షించువారందరూ ఆచరింపవలయును.
♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే – దూర్వాగణపతి వ్రత కథనం నామ త్రయోదశోధ్యాయస్సమాప్తః.
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏
Also Read
- Shravana Masa Mahatmyam – Day 1 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 2 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 3 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 4 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 5 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 6 | శ్రావణమాస మహాత్మ్యము