12వ అధ్యాయం – శ్రావణ శుక్ల తృతీయా తిథౌ “స్వర్ణగౌరీ వ్రత కథనం”

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
శ్రీ స్కాందపురాణం పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.
కథ క్లుప్తముగా
ఈ అధ్యాయంలో, ఈశ్వరుడు సనత్కుమారునికి శ్రావణ శుద్ధ తదియ నాడు ఆచరించవలసిన “స్వర్ణగౌరీ వ్రతం – Swarnagauri Vratham” గురించి వివరిస్తాడు. ఈ వ్రతంలో పార్వతీ పరమేశ్వరులను (Parvati parameswara) షోడశోపచారాలతో పూజించి, పదహారు పిండివంటలు, వస్త్రాలు, ఇతర వస్తువులతో కూడిన పదహారు వాయనాలను దంపతులకు దానం ఇవ్వాలని సూచిస్తాడు. ఈ వ్రతాన్ని ఒక సంవత్సరం నుండి పదహారు సంవత్సరాల వరకు ఆచరించవచ్చని, తరువాత ఉద్యాపన చేయాలని చెబుతాడు. ఈ వ్రత మహిమను వివరించడానికి, చంద్రప్రభుడు అనే రాజు కథను చెబుతాడు. ఒకసారి అడవికి వెళ్ళిన రాజు, అక్కడ అప్సరసలు (Apsaras) ఆచరిస్తున్న స్వర్ణగౌరీ వ్రతం గురించి తెలుసుకొని, తాను కూడా ఆ వ్రతాన్ని ఆచరించి, తోరాన్ని చేతికి కట్టుకుని ఇంటికి వస్తాడు.
రాజు చేతికున్న తోరాన్ని చూసి, పెద్ద భార్య కోపంతో దానిని తెంచివేస్తుంది. ఆ తోరం ఒక ఎండిన చెట్టుపై పడగానే, ఆ చెట్టు చిగురించి పూలు పూస్తుంది. ఈ మహిమను చూసి రెండవ భార్య ఆ తోరాన్ని తీసుకుని చేతికి కట్టుకోగా, రాజు ఆమెపై ప్రేమను పెంచుకుంటాడు. వ్రతాన్ని ఉల్లంఘించిన పెద్ద భార్యను రాజు ఇంటి నుండి వెళ్ళగొట్టగా, ఆమె అడవుల్లో తిరుగుతూ గౌరీదేవిని (Gouri Devi) ప్రార్థిస్తుంది. ఆమె భక్తికి సంతోషించిన గౌరీదేవి ప్రత్యక్షమై, స్వర్ణగౌరీ వ్రత విధానాన్ని బోధిస్తుంది. ఆ వ్రతం ఆచరించిన తర్వాత ఆమె ఇంటికి తిరిగి రాగా, రాజు ఆమెను తిరిగి ప్రేమతో స్వీకరిస్తాడు. ఈ వ్రత ప్రభావం వల్ల రాజు, అతని ఇద్దరు భార్యలు సుఖంగా జీవించి, అంత్యకాలంలో కైలాసం (Kailash) చేరుతారని శివుడు వివరించి, వ్రతానికి ఉద్యాపన విధానాన్ని కూడా తెలియజేస్తాడు.
Shravana Masa Mahatmyam Day – 12
శ్రావణమాస మహాత్మ్యము – 12వ అధ్యాయం
♦️ద్వాదశాధ్యాయము:
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
🌻ఈశ్వర ఉవాచ:
సాంబమూర్తి చెప్పుచున్నాడు…
ఓ సనత్కుమారుడా! ఇక ముందు శుభప్రదమగు స్వర్ణ గౌరీ వ్రతమును చెప్పెదను వినుము. ఆ వ్రతము శ్రావణ శుద్ధ తదియ యందు చేయవలయును. ఉదయమున స్నానం చేసి, సంధ్యావందనాది నిత్యకృత్యములను నెరవేర్చుకొని, సంకల్పము చేసి, పార్వతీ పరమేశ్వరులను షోడశోపచారములచే పూజ చేయవలయును.
ప్రపంచమునకు ప్రభువును దేవతలలో ఉత్తముడవు అగు, ఓ సాంబమూర్తీ! నేను చేయునట్టి పూజను గ్రహించుము,నేను చేయు పూజాస్థలమునకు వచ్చి నివసింపుమని ప్రార్థించవలెను. మహాదేవి యగు పార్వతీదేవి Goddess Parvati Devi)యొక్క తృప్తి కొరకు, వ్రతం సంపూర్తినొందుటకును, పదహారు వాయనములను దంపతుల కొరకు ఇవ్వవలెను.
బ్రాహ్మణులు సంతోషించుట కొరకు వాయనములను ఇచ్చుచున్నానని సంకల్పం చేసి, బ్రాహ్మణులను పిలచి, వేపుడు బియ్యం, పదహారు పిండివంటలతో నిండియున్నవియు, నూతన వస్త్రములతో చుట్టబడినవియు, పదహారు వెదురు పాత్రలను వ్రతం సంపూర్తినొందుటకు సర్వాలంకార భూషితులును పతివ్రతలు అగు సువాసినీ స్త్రీలకు ఇచ్చుచున్నాను. నా కార్య సమృద్ధి నిమిత్తమై వారు గ్రహింతురు గాక, అని ఇవ్వవలయును. ఇట్లు పదహారు సంవత్సరములు గాని ఎనిమిది సంవత్సరాలు గాని, నాలుగు సంవత్సరాలు గాని, ఒక్క సంవత్సరం గాని, తత్కాలమందుగాని, చేసి పిమ్మట ఉద్యాపనం చేయవలెను. పూజ చేసిన పిమ్మట కధను చెప్పిన వానిని పూజింపవలెను.
🌻సనత్కుమార ఉవాచ:
ఓ స్వామీ! ఈ వ్రతమును పూర్వం చేసినవారెవరు, దీని మహిమ ఎటువంటిది, ఉద్యాపనం (Udyapana) చేయు విధమెట్టిది – దీనినంతయు సవిస్తరంగా చెప్పుమని సాంబమూర్తిని సనత్కుమారుడు అడిగెను.
🌻ఈశ్వర ఉవాచ:
సాంబమూర్తి చెప్పుచున్నాడు…
ఓ మునీశ్వరా! నీవు వేసిన ప్రశ్న యోగ్యంగా ఉన్నది. కాబట్టి, దాని వివరము అంతయు నీకు చెప్పెదను వినవలయును. స్వర్ణగౌరీ వ్రతం మనుష్యులకు సమస్త సంపదలనిచ్చును.
పూర్వ కాలంబున సరస్వతీ నదీ (Saraswati River) తీరంబున సువిలమను ఒక పట్టణం కలదు. ఆ పట్టణంబున కుబేరునితో సమాన సంపదగల చంద్ర ప్రభుడను ఒక రాజు, ఆ రాజునకు సౌందర్యంచే మన్మధుని తిరస్కరించు నట్టి రూప లావణ్యం కలవారును, పద్మముల వంటి నేత్రములు కలవారును, మహాదేవి విశాల అను పేర్లుగల ఇద్దరు భార్యలు కలరు. ఆ రాజు, వారిరువురిలో పెద్ద భార్య యందు మిక్కిలి ప్రేమ గలవాడై ఉండెను. ఆ రాజు ఒక నాడు వేటాడుట యందు ఆసక్తి గలవాడై అడవికి వెళ్లి కౄర మృగములగు సింహములను, పెద్ద పులులను, అడవి పందులను, అడవి దున్నలను, ఏనుగులను, సంహరించి, అలసినవాడై దప్పికచే పీడింపబడి జలం నిమిత్తమై ఆ అడవి అంతయు దిరిగెను.
పద్మముల వంటి నేత్రములు గల ఆ రాజు ఇట్లు వనమంతయు తిరుగగా చక్రవాకములు, కారండవములు, తుమ్మెదలు, కోయిలలు, మొదలగు పక్షులతో వ్యాప్తమైనదియు, వికసించిన పద్మములు (Lotus), మల్లెలు, జాజులు, తెల్ల కలువలు, నల్ల కలువలు, మొదలగు పుష్పములతో నిండియున్నదియు, మనోహరమగు ఒక దేవతల కొలను కనుపింపగా దానివద్దకేగి, జలమును పానము చేసి ఒడ్డున భక్తితో పార్వతీ దేవిని పూజింపుచున్న అప్సర స్త్రీలను జూచి మీరు చేయుచున్న వ్రతమేమి!? అని ఆ స్త్రీలను అడిగెను.
ఓ రాజా! మేము చేయునది, స్వర్ణగౌరీ వ్రతము. శ్రేష్ఠమైనది. మనుష్యులకు సమస్త సంపదలనొసగును. కాబట్టి, నీవును ఈ వ్రతమును చేయమని ఆ స్త్రీలు చెప్పిరి.
🌻రాజోవాచ:
ఈ వ్రతమును ఏ విధిగా చేయవలయును, చేసినందు వలన ఫలమేమి కలుగును, దీనినంతయు సవిస్తరముగా చెప్పమని రాజు ప్రశ్న చేయగా, ఆ అప్సర స్త్రీలు చెప్పుచున్నారు….
శ్రావణమాసములో (Shravana Masam) తదియ దినంబున ఈ స్వర్ణగౌరీ వ్రతమును చేయవలయును. ఈ వ్రతము నందు పార్వతీ పరమేశ్వరులను మిక్కిలి భక్తి కలిగి సంతోషముతోగూడి పూజింపవలయును. అనంతరము పదహారు పోగులు పోసిన తోరమును మగవాడు కుడి చేతికిని, ఆడది ఎడమ చేతికిని కట్టుకొనవలెను. లేక తోరమును కంఠమునందైనను ధరింపవచ్చును. అని స్త్రీలు చెప్పిరి.
అనంతరము ఆ రాజు నియమము గల మనస్సుతో గూడినవాడై, ఆ స్వర్ణగౌరీ వ్రతమును చేసి పదహారు పోగులుగల తోరమును కుడిచేతికి కట్టుకొని దేవతలలో ఉత్తమురాలవగు ఓ గౌరీ! నీ వ్రతమును చేసి తోరమును గట్టుకొంటిని, కాబట్టి నా యందు అనుగ్రహము కలదానివగుమని ప్రార్థించి, వ్రతమును పూర్తిచేసి ఇంటికి వెళ్లెను.
ఆ రాజు ఇంటికి వెళ్లగానే కుడి చేతినున్న తోరమును జూచి పెద్ద భార్య మిక్కిలి కోపము కలదగుచు, రాజు వలదు వలదు అన్ననూ.. వినక, రాజు చేతి నుండెడి తోరమును తెంచి వేసి ఇంటికి వెలుపల ఉండెడి ఎండిన చెట్టు మీద పారవేయగా, ఆ చెట్టుకు తోరము తగిలినంతనే ఆ చెట్టు చిగుళ్లు పువ్వులు కలదాయెను.
ఇది అంతయు రెండవ భార్య చూచి, మిక్కిలి ఆశ్చర్యము కలదై వ్యాకులతను చెంది, తెగిపోయి అక్కడ పడియున్న తోరమును తీసుకొని తన హస్తమునకు కట్టుకొనగా, ఆ వ్రత మహిమ వలన ఆ రెండవ భార్యయందు మిక్కిలి ప్రేమ గలవాడాయెను. వ్రతమును ఉల్లంఘన చేయుటచే రాజు కోపించి పెద్ద భార్యను వెళ్ళగొట్టగా.. ఆమె అడవుల యందు తిరుగుచు, దేవిని ప్రార్థించుచు, అక్కడక్కడ కనపడిన మునుల ఆశ్రమములకు పోగా, వారు ఓ పాపాత్మురాలా! అడవులందు ఏల తిరిగెదవు, ఇంటికి పొమ్ము, అని పలికినప్పటికి వినక, మహా ఘోరమగు ఆ అడవియందే తిరుగుచు, అలసి, విచార పడుచు ఒక చోటున కూర్చుండెను.
అనంతరము గౌరీదేవి ఆ రాజు యొక్క భార్యయందు దయ కలిగి, ఎదుట ప్రత్యక్షము కాగానే, ఆ రాజు భార్య గౌరీ దేవిని చూచి సాష్టాంగ దండప్రణామము చేసి, ఓ దేవీ! భక్త వరదే! శంకరవామాంగే! మంగళమంగళే! నీకు నమస్కారము అని ఈ ప్రకారము ప్రార్థించి, ఆ గౌరీదేవి వలన స్వర్ణగౌరీ వ్రతమును తెలిసికొని, భక్తితో యధావిధిగా ఆచరింపగా, గౌరీదేవి సంతోషించి వరములనిచ్చెను. అనంతరము ఆమె ఇంటికి వెళ్లగా, వ్రత మహిమచే తన భర్త తిరిగి తన ఇంటనుంచుకొని పూర్వము వలెనే ప్రేమతో నుండెను.
అనంతరము ఆ రాజు పెద్ద భార్య గౌరీదేవి యొక్క అనుగ్రహము వలన సమస్త కోరికలను పొందెను. ఇట్లు ఆ రాజు ఇద్దరు భార్యల యందు సమాన ప్రేమ గలవాడై, సమస్త సంపదలను అనుభవించి కొంతకాలము రాజ్యము చేసి, అంత్యకాలమందు ఆ ఇద్దరు భార్యలతో గూడ కైలాసము చేరెను.
ఓ మునీశ్వరుడా! శుభ ప్రదమగు ఈ స్వర్ణగౌరీ వ్రతమును చేసినవాడు నాకు, గౌరీదేవికిని ప్రియమైన వాడగుచు విశేషమగు సంపదను పొంది శత్రువులందరినీ జయించి శ్రేష్ఠంబగు శివుని నివాసస్థానమైన కైలాసమును చేరుదురు.
ఓ మునీశ్వరుడ! ఈ స్వర్ణగౌరీ వ్రతమునకు ఉద్యాపన విధానమును చెప్పెదను, సావధానముతో వినుము. యోగ్యమైన తిథి వారములు గల దినమందు తారాచంద్ర బలయుక్తముగా ఉండునప్పుడు, చేయదలచినవాడై మంటపము నేర్పరచి అష్టదళములు గల పద్మమును లిఖించి, అచ్చట ధాన్యమును రాశిగా పోసి దానిపైన పదిహారు నవటాకుల యెత్తుగల రాగి కలశమును నువ్వులతో నిండించి యందుంచి, దానిపైన పార్వతీపరమేశ్వరుల ప్రతిమలనుంచి, వేదోక్త మంత్రములచే ఆవాహనాదులను గావించి, రెండు తెల్లని వస్త్రములను, యజ్ఞోపవీతములను ఉంచి, యధావిధిగా పూజనంతయు గావించి, ఆ రాత్రి జాగరణము చేయవలెను. అనంతరము మరునాడు ఉదయమున ప్రాతఃకాల పూజ గావించి, ముందుగా నవగ్రహ హోమము చేసి, పిమ్మట ప్రధాన దేవతకు హోమము చేయవలెను.
నువ్వులు, బియ్యము, నెయ్యి కలిపి హోమం చేసి, ధనవంతుడైనచో, విశేషముగా చేయవలెను, లేక వెయ్యి పర్యాయములు గాని, నూరు పర్యాయములు గాని హొమము చేసిన పిమ్మట ఆచార్యునకు వస్త్రములు, ఆభరణములు, ఆవులు మొదలగు వానిని పూజించి ఇచ్చి, పదహారుగురు దంపతులకు వాయన దానమిచ్చి, పిమ్మట బ్రాహ్మణులను భుజింపజేసి, తన శక్తి కొలది, వారికి విశేష దక్షిణలను ఇచ్చి, ఆనందముతో గూడినవాడై, బంధువులతో గూడ అనంతరము తాను భుజింపవలయునని సాంబమూర్తి, సనత్కుమారునితో చెప్పెను.
♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే – తృతీయా తిథౌ స్వర్ణగౌరీ వ్రత కథనం నామ ద్వాదశోధ్యాయ స్సమాప్తః..
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏
Also Read
- Shravana Masa Mahatmyam – Day 1 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 2 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 3 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 4 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 5 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 6 | శ్రావణమాస మహాత్మ్యము





