మాఘ పురాణం | Magha Puranam – Day 5

మాఘ పురాణం – 5 వ అధ్యాయము

Magha Puranam - Day 5

మాఘ పురాణంలోని (Magha Puranam) ఐదవ అధ్యాయం, ధనవంతుడి కుక్క చనిపోయిన తర్వాత దాని గత జన్మ రహస్యాలు తెలియజేస్తూ, కర్మఫలితాల గురించి కథ చెబుతుంది. ధనవంతుడు తన ప్రియమైన కుక్క మరణించాక దాని ఆత్మకు శాంతి కలుగుతుందా అని ఆందోళన చెందుతాడు. ఋషి వాక్కుల ద్వారా, కుక్క గత జన్మలో దుర్మార్గుడిగా జీవించి, కర్మ ఫలితంగా కుక్కగా పునర్జన్మ పొందిందని, ఇప్పుడు తన కర్మ తీర్చుకుని స్వర్గానికి చేరిందని తెలుసుకుంటాడు. ఈ కథ మన జీవితాలు మన కర్మలచేత నిర్దేశించ బడతాయని, మంచి పనులు మంచి ఫలితాలను, చెడు పనులు చెడు ఫలితాలను ఇస్తాయని గుర్తు చేస్తుంది. మాఘ పురాణం – 5 వ అధ్యాయము (Magha Puranam – Day 5) నందు ఈ క్రింది విధముగా …

దిలీప మహారాజా ! సుమిత్రుని కథ ఈశ్వరుడు (Lord Shiva) పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావుకదా ! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. అదెట్లనగా మాఘమాసములో నదీస్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుదురు. వర్తమానకాలమునందు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నపటికి  మాఘమాసము మొద ఐన తరువాత, వారి కష్టములు క్రమముగా సమసిపోవును. మాఘశుద్ద దశమినాడు నిర్మలమైన మనస్సుతో శ్రీ మన్నారాయణుని పూజించినయెడల శ్రీహరి (Lord Vishnu) కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అణుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి (Parvati) –

“నాధా ! శ్రీ లక్ష్మినారాయణుల (Lakshmi Narayana) వ్రతము చేసినచొ మనో వాంఛా ఫలసిద్ది కలుగుతుందని చెప్పియున్నారు కదా! ఆ వ్రత విధాన ఎలాంటిదో, ఎలాగా ఆచరించవలెనో తెలియ పరచమని” కోరినది. అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమినాడు ప్రాతఃకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డునగాని, ఇంటివద్ద కాని, మంటపము నుంచి ఆ మంటపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య యెనిమిది రేకుల పద్మము వేసి, అన్ని రకాల పుష్పములు, ఫలములు తీసుకువచ్చి లక్ష్మినారాయణులను మంటపపు మధ్యనౌంచి, ఆ విగ్రహాలకు గంధ ము, కర్పూరము, అగరు మొదలగు ద్రవములు పూసి పూజించవలెను. రాగిచెంబులో నీళ్ళుపోసి మామిడిచిగుళ్లను అందులోవుంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్తవస్త్రము నొకదానిని కప్పి, లక్ష్మినారాయణుల ప్రతిమను ప్రతిష్టించి పూజించవలెను. ఆ మండపము మధ్యలో సాలగ్రామమును ఉంచి, ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారిచేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము పెట్టవలెను.

తరువాత రాగిపాత్రలో నీరుపోసి అర్ఘ్యప్రదానము చేయవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర (Sri Ramachandra) ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయును. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కాయగూరలు, పండ్లు మొదలగునవి ఏకపాత్ర యందు వుంచికాని, క్రొత్త గుడ్డలో మూటగట్టి కాని దానమియ్యవలయును. మాఘపురాణమును (Magha Puranam) స్వయముగా పఠించునపుడుగాని, లేక వినునప్పుడు కాని చేతిలో అక్షితలు ఉంచుకొని, చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపైవేసుకొనవలయును గాన ఓ శాంభవీ ! మాఘ స్నానముచేసి మాఘశుద్ధ దశమినాడు లక్ష్మినారాయణులను నిష్ఠతో పూజించిన యెడల యెటువంటి మాహా పాపములైనను నశించిపోవును.

ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసెదను, సావధానురాలవై వినుము. గౌతమమహర్షి, ఒకనాడు తన శిష్యులతోగూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరదిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్య నదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములని దర్శించుచు మార్గమందున్న ముని పుంగవులతో యిష్టా గోష్ఠులు జరుపు కొన్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన (Krishna River) కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో కుడి  కృష్ణా నదిలో సూర్యోదయం సమయమునందు స్నానము చేసి, తీరమున కలిగిన ఒక రావిచెట్టు చెంతకు వచ్చి

అని రావి చెట్టుకు (Peepal Tree) నమస్కరించి, ఆ చెట్టు మొదట ఆసీనుడయి శ్రీహరిని (Lord Vishnu) విధియుక్తముగా పూజించెను. తరువాత శిష్యులందరికి మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధముగా ప్రతి దినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపమేర్పరచి ముగ్గులు, బొట్లు పెట్టి, మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించినారు.

ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్ప వాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచట నుండి లేచి ఉత్తరం వైపు మళ్ళి మరల తూర్పునకు తిరిగి, రావి చెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క రావి చెట్టు చుట్టు తిరిగివచ్చినది. అప్పటికి మూడు సార్లు ఆ మండపము చుట్టు ప్రదక్షిణము చేసినందుకు, అది మాఘమాసము అయి ఉన్నందున అది వెంటనే తన కుక్క రూపము నుండి ఒక రాజుగా మారిపోయెను. ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునులయెదుట నిలబడి వారందరికి నమస్కరించెను. అక్కడున్న ఆడ కుక్క రాజుగా మారిపోవుటచూచిన మునులూ, గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి. “ఓయీ ! నీవెవ్వరవు ? నీవిట్లు మారుటకు కారణమేమి ?” అని గౌతముడు ప్రశ్నించెను.

“ముని చంద్రమా ! నేను కళింగ రాజును, మాది చంద్రవంశము నాపేరు జయచంద్రుడు, నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ వున్నాను, దాన ధర్మములనిన నాకు అతిప్రేమ, నేను అనేక దానాలు చేసియుంటిని, గో, భూ, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసియున్నాను, ఎక్కువగా అన్న దానము, తిల దానము చేసియున్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మ శాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల కొరకు అన్న దానములు, మంచి నీటి చలివేంద్రములును ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను (Temples) నిర్మించి, దైవ విగ్రహాలను ప్రతిష్టించాను. సద్బ్రాహ్మణులచే, వేదాలు చదువుకొన్న  పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో వున్న ధర్మాలన్నియును చేసియున్నాను. కాని, నేనిలా కుక్కనయ్యాను, దానికి కారణము లేకపోలేదు. ఆ కారణము కూడా నేను విశరపరచెదను వినుడు.

ఒకానొక దినమున ఒకముని పుంగవుడు గొప్ప యఙ్ఞ మొకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటన్న సామాన్య విషయము కాదు కదా ! దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావలెను గాన, ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. ముని సత్తముడు వచ్చిన వెంటనే యెదురేగి కాళ్ళుకడిగి ఆ నీళ్ళు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలడిగితిని ఆ మునియు  నా సత్కారమునకు మిక్కిలి సంతసించి, ‘రాజా ! నీకు గుప్త విషయములు తెలియ జేయుదును, ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్మ్యమును చదువుట కాని లేక వినుట కాని చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును.

అంతియేకాగ, అశ్వమేధ యాగము (Aswamedha Yaga) చేసిన యెడల యెంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కాని, తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలముగాని లేక దానపుణ్యములు అనగా వంద యాగాలు చేసినంత ఫలముగాని పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినగాని, దశమి ఆదివారం వచ్చిన కాని ఉదయమే స్నానము చేసిననూ మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసిననూ మానవుడు యెటువంటి పాపములనైనను విడువగలడు.

ఒక వేళ యితర జాతుల వారైనను మాఘ మాసమంతా నిష్ఠతో నదీ స్నానమాచరించి, దాన ధర్మాలాచరించి మాఘ పురాణము పఠించినను లేక వినినను మరు జన్మలో బ్రాహ్మణులై జన్మింతురు, అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించి నటుల మాటలాడి యిట్లంటిని. అయ్యా ! మునిసత్తమా ! మీరు పలికిన విషయములు నాకు తెలియును, అన్నియు బూటకములు. వాటిని నేను యదార్థములని అంగీకరించెను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటికాదు గాన నేనుయే మాఘ మాసములు (Magha Masam) చేయుట కాని, దాన పుణ్యాదులు చేయుటగాని, పూజా నమస్కారములు ఆచరించుటకాని చేయును. చలి దినములలో చల్లని నీటితో స్నానము చేయుట ఎంత కష్టము ? ఇక నాకు యీ నీతిబోధలు చెప్పకుడు. నాకు ఉన్న ఫలములు చాలని ఆ మునితో అంటిని. 

నా మాటలకు మునికి కోపము వచ్చింది. ముఖం చిట్లించుకొని సరే, నేను చెప్పవలసినది చెప్పితిని. అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసికొనకుండానే వెడలి పోయినాడు. అంతట నేను ఆ మునిని చేతులుపట్టి బ్రతిమలాడగా, యెట్టకేలకు అంగీకరించి ధనమును తీసికొని పోయెను, ఆ విధముగా నేను కొంత కాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని, తరువాత నాకు వరుసగా యేడు జన్మలూ కుక్క జన్మయే వచ్చినది. నా పాప ఫలమేమోగాని కుక్కగా యేడు జన్మలూ బాధపడితిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టు మూడు పర్యాయములు ప్రదక్షిణము జేసితిని కాన నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగినది. దైవ యోగమును యెవ్వరునూ తప్పించలేరు గదా ! ఇటుల కుక్కజన్మలో ఉండగా మరల నాకు పూర్వజన్మ స్మృతి యెటుల సంక్రమించినదో వివరింపుడనివేడెదను అని రాజు పలికెను.

ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమముని ఆశ్చర్యపడి మాఘ మాసమును నీవు చులకనగా చూచుట వలన యెంతటి విపత్తు వాటిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను చెప్పిన విషయములు అన్నియు యదార్థములే,  నీవు కుక్కవై యెటుల పవిత్రుడైనవో ఆ వృత్తాంతమును వివరించెదను సావధానముగా ఆలకింపుము.

నేను నా శిష్యులతో (Krishna River) కృష్ణవేణీ తీరమందుండి ఈ మాఘ మాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరోక పుణ్యనదికి పోవుదమని వచ్చియుంటిని. మేమందరము ఈ వృక్ష రాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించు కొనుచున్నాము. కుక్క రూపములో నున్న నీవు దారిని పోతూ యిచ్చట నైవేద్యమును చూసి తినవలయుననెడి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు యెలాగున్నావో తెలుసా ! నీ శరీరమున బురదమైల తగిలివున్నది. చూచుటకు చాలా అసహ్యముగా వున్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజ చేయుచున్న సమయములో అచటకు జంతువు కాని, పక్షికాని, వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమే కదా ! నీవు అసహ్యముగా వుంన్నందున నా శిష్యులు నిన్ను తపో దండములతో నిన్ను కొట్టబోవుటచే పారిపోయి, నైవేద్యమును తినవలెనని ఆశతో తిరిగి యధా స్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళి వచ్చినావు.

అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుటవలన మాఘమాస ఫలము  కలిగి పునర్జన్మ వచ్చినదన్న మాట. ఇక మాఘమాస మంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి, పురాణ పఠనము చేసినచో యెంతటి ఫలము వచ్చునో ఊహించుకొనుము, అని చెప్పగా రాజు వినుచుండగా, అంతలోనే ఆ రావి చెట్టు నకున్న ఒక తొర్ర నుండి ఒక మండూకము బయటకు వచ్చి, గౌతమ ఋషి పాదముల పైపడి బెక బెకమని అరచి, అటునిటు గెంతుచుండెను. అలా గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూస్తూ ఉండగా కొద్దీ సమయములో హఠాత్తుగా కప్ప రూపమును వదలి  ముని వనితగా మారిపోయెను. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి, గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమముని ‘అమ్మాయీ ! నీ వెవ్వరిదానవు ? నీ నామధాయమేమి ? నీ వృత్తాంతము  యేమి ?’ అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియ చేయుటకై యిట్లు చెప్పసాగేను.

Read more Puranas

Leave a Comment