Thiruppavai Pasuram – Day 15 | తిరుప్పావై పాశురము – 15వ రోజు

Thiruppavai Pasuram 15

శ్రీమన్నారాయణుడు అమ్మవారితో చెప్పిన నామసంకీర్తనము Thiruppavai Pasuram – తిరుప్పావై పాశురము, శరణాగతి, పుష్పార్చన అనే సులభోపాయాలను లోకానికి అందించేందుకు గోదాదేవి – Godadevi (ఆండాళ్ – Andal) భూమిపై అవతరించింది. శ్రీరంగనాథుడిని (Sri Ranganatha Swamy) భర్తగా పొందాలనే సంకల్పంతో, ద్వాపరయుగంలో గోపికలు చేసిన వ్రతాన్ని అనుసరిస్తూ ఆమె “తిరుప్పావై – Thiruppavai” అనే 30 పాశురాలను రచించింది. భగవంతుని అనుగ్రహం పొంది, సంసార దుఃఖాల నుండి విముక్తి పొందడమే ఈ వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో 

శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్

వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్

వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ

ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై 

ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్

వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క

వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్

Credits: @BharatiyaSamskruthi

మనిషికి సహనం, ఓరిమి కలగడం చాలా కష్టం. ఉద్రేకం రావడం అనేది మానవ సహజం, కాని దాన్ని ఓరిమితో సహించడం మానవ ప్రయత్నంతోనే సంభవం. దీన్నే మనం సాధన అంటాం. ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది. అలా ఏర్పడి ఉంటే, అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడింది. మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే. ఆచార్య సన్నిదానానికి చేరే ముందర కల్గాల్సిన దాంట్లో ఇది ముందర స్థితి. ఈ రోజు ఆండాళ్ తల్లి ఎట్లాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో చెబుతుంది. 

ఈరోజు పాశురం బయట గోపబాలికలకు లోపల గోపబాలిక (Gopabalika) మద్య సంభాషణలా సాగుతుంది. నిన్నటి గోపబాలికతో కల్సి వీరంతా స్వామిని పంఖజ నేత్రా, పుండరీకాక్షా (Pundarikaksha) అని పాడుతుంటే విన్నది. ఈవిడకి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం. తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమోనని అనుకోని తాను లోపల నుండే గొంతు కలిపి ఆనందిస్తుంది.

అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోప బాలిక మెలుకువతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపంతో, “ఎల్లే!” ఏమే “ఇళంకిళియే!” లేత చిలకా! “ఇన్నం ఉఱంగుదియో” ఇంకా నిద్ర పోతూనే ఉన్నావా. వీళ్ళకేమో ఈ గోపబాలిక అందమైన గొంతు కలదని, వారి వెంట ఈ గోప బాలిక ఉంటే శ్రీకృష్ణుడు (Sri Krishna)తప్పక వాళ్ళకు దొరుకుతాడు అని భావిస్తున్నారు ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు. 

కాని లోపల గోప బాలికకు నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతో నేనుండగా నన్ను పొగడటం సరికాదు అని, శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి “శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్” ఏమిటా గోల మీరంతా, శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమి లేడు “నంగైమీర్!” పరిపూర్ణులు మీరే. “పోదరుగిన్ఱేన్” వస్తున్నాను అని అంది. 

బయట నుండి వాళ్ళు ” వల్లై” మహా సమర్దురాలివే “ఉన్ కట్టురైగళ్” నీ నోటి దురుసుతనం మాకు తెలుసులే, “పండేయున్ వాయఱిదుమ్” ఎప్పటి నుండో మాకు నీ సంగతి తెలుసులే అని అన్నారు. అంతలో లోపల గోప బాలిక “వల్లీర్గళ్ నీంగళే” మీరే సమర్థులు, నన్నా సమర్థురాలు అని అంటున్నారు, అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటుచే భాదలో ఉన్నాను, మీరేమో అంతా కల్సి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు,  “నానే తాన్ ఆయిడుగ” రాకపోవడం నాదే తప్పు అని ఓరిమితో అంది. 

కాని బయట నుండి, “ఒల్లై నీ పోదాయ్” ఏమే రా! మరి ఇంక, “ఉనక్కెన్న వేఱుడైయై” మరి తప్పు ఒప్పుకున్నా నీకేమి వేరే అనుభవమా మరోకసారి ఎత్తిపొడిచారు లోపల గోపబాలికను పరిక్షించటానికి. ఆమె లోపల నుండి “ఎల్లారుం పోందారో” అంతా వచ్చారా అంది, బయట నుండి వీల్లు “పోందార్” అందరూ వచ్చారు, నీవు బయటికి రా నీ దర్శనం మాకు కావాలి అన్నారు. 

 “పోంద్-ఎణ్ణిక్కోళ్” ఏం చేద్దాం అందరం అని ఆడిగింది లోపల గోప బాలిక. “వల్లానై కొన్ఱానై ” బలం కల్గిన ఏనుగు – కువలయాపీడం “మాత్తారై మాత్తరిక్కవల్లానై” దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి, శత్రువులలోని శత్రుత్వాన్ని తోలగించగల్గినవాడు “మాయనై” చిత్ర విచిత్ర మైన మాయలు చేసే మాయావిని “ప్పాడ” పాడుదాం.

ఆండాళ్ తల్లి అయిదో పాటలో మాయనై అని మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది. శ్రీకృష్ణుడు పుట్టింది మథురలో – Mathura, పెరిగింది గోకులంలో- Gokulam అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మళ్ళీ మథురా నగరానికి తిరిగి వచ్చి కంసుడి సంహారం చేసాడు. మథురా నగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చేవరకు ఉంది ఆయన మాయ. పుట్టగానే రాత్రికి రాత్రికే యమునా నది (Yamuna River) దాటి ఆవల గోకులానికి బయలుదేరాడు. అక్కడికి పంపిన పూతన, శకటాసురుడు (Shakatasura), అశ్వాసురుడు, బకాసురుడిని (Bakasura) సంహరించి తన కళ్యాణ గుణాలతో అక్కడి వారిని పిచ్చెక్కించి, అక్కడి నుండి తిరిగి మథురకు వచ్చి కువలయాపీడాన్ని, చారూణముశ్టికులను చంపి, కంసున్ని చంపి, బందీగా ఉన్న ఉగ్రసేనున్ని రాజుగా చేసి మథురా నగరానికి పట్టిన దారిద్ర్యాన్ని తొలగించాడు. ఇది భగవంతుడు చేసే చేష్ట. 

ఈ రోజుతో పదో గోపబాలికను లేపుతూ మనకు ఒక పది రకాల జ్ఞానులని, వారి జ్ఞాన దశలను పరిచయం చేసింది ఆండాళ్. అలాంటి యోగ్యత కల్గిన మహనీయుల్ని మనం చేరి ఉండాలని, వారిని దర్శించుకుంటూ వారు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగ గలిగితే అది మనకు శ్రేయస్సు. ఇది నిలబడడానికి మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి తప్ప, లోకంలో భక్తులను దూరం చేసుకోకూడదు. తిరుప్పావై మనకు అదే నిరూపణ చేస్తుంది. పదిమంది గోపికలను (Gopika) లేపే ఈ పది పాటలే తిరుప్పావై అంటారు, ఇక ఈ నమ్మకం గట్టి పడటానికి మిగతా పాటలు.

ఆండాళ్ తిరువడిగళే శరణం..శరణం.

Aslo Read

Leave a Comment