Shravana Masa Mahatmyam Day – 22 | శ్రావణమాస మహాత్మ్యము

Shravana Masa Mahatmyam Day - 22

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. 

శ్రీ స్కాందపురాణం పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.

ఈ అధ్యాయంలో, ఈశ్వరుడు సనత్కుమారునికి శ్రావణ బహుళ చతుర్థి (Shravan Bahula Chaturthi) నాడు ఆచరించవలసిన “సంకష్టహరణ వ్రతం – Sankshahara Vrat” గురించి వివరించాడు. ఈ వ్రతం సమస్త కోరికలను నెరవేర్చి, అన్ని కష్టాల నుండి విముక్తి కలిగిస్తుందని పేర్కొన్నాడు. వ్రతం చేసేవారు చతుర్థి నాడు (Chaturthi) ఉదయం సంకల్పం చెప్పుకొని, నల్ల నువ్వుల నూనెతో స్నానం చేసి, ఉపవాసం ఉండాలి. తమ శక్తికి తగినట్లు బంగారు (Gold), వెండి, రాగి లేదా మట్టితో వినాయకుని ప్రతిమను (Ganesha statue) చేసి, కలశంపై ఉంచి షోడశోపచారాలతో పూజించాలి. నువ్వులతో చేసిన పది కుడుములను చేసి, ఐదు కుడుములను వినాయకునికి నివేదించి, మిగిలిన ఐదు కుడుములను బ్రాహ్మణునికి దానం చేయాలి. చంద్రోదయం తర్వాత చంద్రునికి (Lord Chandra) అర్ఘ్యం ఇచ్చి, బ్రాహ్మణులకు భోజనం పెట్టి, ఆ తర్వాత తాను భుజించాలని శివుడు తెలియజేశాడు.

వినాయకుడిని (Vinayaka) పూజించేటప్పుడు “ఓం నమో భగవతే హేరంబాయ మదమోదితాయ నమస్వాహా” అనే 21 అక్షరాల మంత్రాన్ని జపించాలని, అలాగే గణాధిప, ఉమాపుత్ర వంటి 21 నామాలతో పూజించాలని ఈశ్వరుడు తెలియజేస్తాడు. ఈ వ్రతం ఆచరించిన వారికి విద్య, ధనం, సంతానం, మోక్షం వంటి కోరికలు నెరవేరుతాయని, రోగాలు, ఆపదలు తొలగిపోతాయని చెప్పాడు. ఈ వ్రత మహిమను నిరూపిస్తూ, పార్వతి (Goddess Parvati), కుమారస్వామి (Kumara Swamy), అగస్త్యుడు, దమయంతి, మన్మథుడు వంటివారు ఈ వ్రతం ఆచరించి తమ కోరికలను సాధించుకున్నారని శివుడు ఉదాహరణలిచ్చాడు. ఈ వ్రతం తపస్సు, దానం, తీర్థయాత్రల కంటే గొప్పదని, శ్రద్ధగలవారికి మాత్రమే దీనిని ఉపదేశించాలని సనత్కుమారునికి చెబుతూ ఈ అధ్యాయాన్ని ముగించాడు.

🍃🌷ద్వావింశోధ్యాయము – చతుర్థ్యాం సంకష్టహరణ వ్రత కథనం:

(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll

🌻ఈశ్వర ఉవాచ:

ఓ మునీశ్వరుడా! శ్రావణ బహుళ చవితి యందు సమస్త కోరికలను ఒసగు నట్టి “సంకష్టహరణము” అను వ్రతము కలదు, అని సాంబమూర్తి చెప్పెను… 

🌻సనత్కుమార ఉవాచ:

ఓ భగవంతుడా! ఈ సంకష్ట హరణ వ్రతము ఏ ప్రకారము చేయవలయునో, ఏఏ వస్తువులు కావలయునో, ఏ ప్రకారముగా పూజించవలెనో, ఉద్యాపనను ఎప్పుడు చేయవలయునో…ఇది అంతయు సవివరముగా చెప్పుమని సనత్కుమారుడు సాంబమూర్తిని తిరిగి ప్రశ్నచేసి అడిగెను.

🌻ఈశ్వర ఉవాచ:

సాంబమూర్తి చెప్పుచున్నాడు…

ఓ మునీశ్వరా! శ్రావణం బహుళ చవితి యందు, ఉదయంబున లేచి దంతధావనాది కృత్యములను దీర్చి, స్నానము చేసి, పరిశుద్ధుడై, ఓ స్వామీ! ఈ దినంబున పుణ్య ప్రదమైనదియు, శ్రేయస్కరమగు సంకష్టహరణ వ్రతమును చేసెదను. చంద్రోదయమగు పర్యంతము నిరాహారుడనై, నిన్ను పూజించి, పిమ్మట భుజించెదను. కావున నన్ను కష్టముల నుండి తొలగింపుము.

ఓ బ్రహ్మపుత్రుడా! ఈ ప్రకారము ప్రాతఃకాలంబున సంకల్పమును చేసి, నల్ల నువ్వుల నూనెతో అభ్యంగనముచే స్నానము చేసి, సంధ్యావందనము, అగ్నిహోత్రము, వైశ్వదేవము మొదలగు పగటి కృత్యములు నెరవేర్చి పిమ్మట వినాయకుని పూజింపవలయును.

వ్రతమును చేయదలచిన వాడు జ్ఞానసంపన్నుడై, పదిహేను గురువింద గింజల బరువు గల బంగారముతో గాని, దానిలో సగము గాని, మూడవ వంతు బంగారముతో గాని, లేక తన శక్తి ననుసరించి బంగారపు ప్రతిమను చేయించవలెను. బంగారము లేనప్పుడు, వెండితో గాని, రాగితో గాని, చేయించవలెను, అంతకును శక్తి లేక దరిద్రుడుగా ఉండువాడు మట్టితోనైనను చేయవలెను. తన శక్తి కొలది చేయవలయును గాని, శక్తి కలిగిన ఎడల, లోపము చేయకూడదు అలా చేసిన ఎడల తాను చేసిన కార్యము వ్యర్ధమగును. కావున, ప్రారంభమున అష్టదళములు గల మనోహరమగు పద్మాకారమును ఏర్పరచి, ఉదకముతో నిండింపబడిన పూర్ణకలశమును ఉంచి, దానియందు ఆ ప్రతిమను ఉంచి, వేదోక్తమంత్రములచే (Veda Mantra) షోడశోపచారములతో వినాయకుని పూజింపవలెను.

ఓ బ్రాహ్మణుడా! నువ్వులతో గూడినవియు శ్రేష్ఠంబగు పది కుడుములను చేసి, అయిదు కుడుములను స్వామికి నివేదన చేసి అయిదు కుడుములను బ్రాహ్మణునకు వాయనమియ్యవలెను. భక్తికలవాడై, ఆ బ్రాహ్మణుని దేవతతో సమామనిగా దలచి, పూజించి, తన శక్తి కొలదియు దక్షిణనిచ్చి, పిమ్మట ఈ విధముగా ప్రార్ధింపవలెను. 

ఓ బ్రాహ్మణోత్తమా! నీకు నమస్కారము చేసెదను. ఓ స్వామీ! పండ్లతోను దక్షిణతోను గూడిన అయిదు కుడుములను నీకు దానమిచ్చుచున్నాను, ఆవి గ్రహించిన వాడవై ఆపత్తుల వలన నన్ను తరింపచేయుము, ద్రవ్యము లేని వాడనై ఇట్టి వ్రతమును చేయుచుంటిని కావున, బ్రాహ్మణ స్వరూపమును ధరించిన ఓ వినాయకుడా! దానినంతయు సంపూర్ణమగునట్లు చేయుము. అని ప్రార్థించి, పిమ్మట రుచిగల పదార్ధములతో బ్రాహ్మణులకు భోజనం పెట్టవలెను. 

అనంతరము చంద్రునకు అర్ఘ్యమియ్యవలెను. ఆ మంత్రమును సవివరముగా వినుము. పాలసముద్రము నందు పుట్టిన వాడవును, అమృత స్వరూపుడవగు ఓ చంద్రుడా! నేను ఇచ్చునటువంటి అర్ఘ్యమును గ్రహింపుము. సంతోషముతో నన్ను వృద్ధి పొందింపుము అని చెప్పి అర్ఘ్యమియ్యవలెను. ఈ ప్రకారము చేసిన ఎడల గణాధిపతి (Ganadhipati) సంతోషించినవాడై, కోరిన సమస్త కోరికలను ఒసగును, కావున, ఈ సంకష్ట హరణ వ్రతమును ఆచరించవలయును.

విద్యను కోరినవాడు విద్యను, ధనమును కోరినవాడు ధనమును పుత్రులను కోరినవాడు పుత్రులను, మోక్షమును కోరినవాడు మోక్షమును, కార్యములను కోరినవాడు కార్యములను పొందును. రోగము కలవాడు ఆరోగ్యం కలవాడగును. ఆపత్తులతో గూడుకొనిన వారి యొక్కయు, మనోవ్యాకులము గల వారి యొక్కయు, చింతతో గూడిన వారి యొక్కయు స్నేహితుల వియోగము గలవారి యొక్కయు, సమస్త కష్టములను తొలగించునదియు సమస్త కోరికలనిచ్చునదియును, పుత్రులను పౌత్రులను కలిగించునదియు మమష్యులకు సమస్త సంపత్తులు ఒసగునటువంటి ఈ వ్రతమును ముఖ్యముగా చేయవలయును. పూజ చేయనప్పుడును, జపము చేయునప్పుడును, ఉపయోగించవలసిన మంత్రమును చెప్పెదను వినుము. “ఓం నమో భగవతే హేరంబాయ మదమోదితాయ నమస్వాహా” అను ఇరువది ఒక్క అక్షరములు గల మంత్రమును పఠించిన ఎడల సమస్త కష్టములును తొలగి పోవును.

ఇంద్రుడు (Lord Indra) మొదలగు అష్టదిక్పాలకులను అందరిని పూజింపవలెను. మరియు ఇంకొక విషయము గలదు. అది కుడుముల సంబంధమైనది దానిని నీకు చెప్పెదను వినుము.

పక్వమగు నువ్వులు, కొబ్బరి, బెల్లము కలిపి, అది పూర్ణముగా లోపల పెట్టి, పైన గోధుమపిండితో కప్పుగా ఉండునట్లుజేసి, నేతితో వండి, అవి వినాయకునకు నివేదన చేయవలెను.

అనంతరము గరిక చిగుళ్ల తో ముందు చెప్పబోయెడు ఈ గణాధిపతి నామములను స్మరింపుచు వేరువేరుగా గణనాధుని పూజింపవలయును..

గణాధిప, ఉమాపుత్ర, ఆఘనాశన, ఏకదంత (Ekadanta), ఇభవక్త్ర, మూషకవాహన, వినాయక, ఈశపుత్ర, సర్వసిద్ధి ప్రదాయక, విఘ్నరాజ (Vighnaraja), స్కందగురో, సర్వసంకష్టనాశన, లంబోదర, గణాధ్యక్ష, గౌర్యంగమల సంభవ, ధూమ్రకేతో, బాలచంద్ర, సిందూర, అసురమర్దన, విద్యా విధాన, వికట, శూర్పకర్ణ….నీకు నమస్కారము.

అని చెప్పి ఈ ఇరువది ఒక్క నామముల చేతను వినాయకుని పూజింప వలయును.

అనంతరము దేవతను నిర్మలమగు బుద్ధి కలవాడగుచు, భక్తి కలవాడై ప్రార్ధించవలయును. ఓ విఘ్నరాజా! నీకు నమస్కారము చేసెదను. ఉమాపుత్ర, ఆఘనాశన, దేనిని గురించి నా శక్తి కొలదియు పూజించితినో, అటువంటి నా పూజచే గణాధిపతి సంతోషించినవాడై, నా మనస్సు యందుండెడి సర్వ కోరికలనిచ్చి, నా మనోరథము సఫలము చేయు గాక! నా సంబంధమగు అనేక విధములైన విఘ్నములను నశింపుచేయుము. నీ అనుగ్రహముచే సమస్త కార్యములను చేయుగలవాడనైతి.

ఓ వినాయకా! నా శత్రువులను నశింపజేసి, మిత్రులను వృద్ధి చేయుము. అని ప్రార్తించి, పిమ్మట నూట ఎయెనిమిది పర్యాయములు హోమం చేయవలెను. 

వినాయకుడు ప్రీతి నొందుట కొరకును, వ్రతము పూర్తినొందుట కొరకును, బ్రాహ్మణునకు నేను వాయనము ఇచ్చుచున్నానని, ఏడు లడ్డూలను గాని, బూరెలనుగాని, ఫలములతో గూడ బ్రాహ్మణునకు వాయనమిచ్చి పిమ్మట పుణ్యప్రదమైన కధను విని, ఓ మునీశ్వరుడా! ఈ ముందు చెప్పబోవు దానిచే చంద్రునకు ఐదు పర్యాయములు అర్ఘ్యమియ్యవలయును. అది ఏ విధముగా ననగా, పాలసముద్రము నందు జన్మించిన వాడవును, అత్రిమహాముని (Atri Mahamuni)  వంశము నందు జన్మించిన వాడవునగు, ఓ చంద్రుడా! నీ భార్యయగు రోహిణీదేవితో గూడిన వాడవై నేను ఇచ్చునటువంటి అర్ఘ్యమును గ్రహింపుమని చెప్పి అర్ఘ్యం విడువవలెను.

అనంతరము, భగవంతుని క్షమార్పణ గోరి, పిమ్మట తన శక్తి కొలదియు బ్రాహ్మణులకు భోజనము పెట్టి, మిగిలిన పదార్ధమును బ్రాహ్మణుల వలన అనుజ్ఞ గొని తాను భుజింపవలెను.

మౌనము కలవాడై ఏడు కబళములను భుజింపవలయును. అందువలన, దృఢముగా నుండువాడు కాకుండెనేని తన ఇష్ట ప్రకారము భుజింపవలెను. ఈ ప్రకారము మూడు మాసములు గాని, నాలుగు మాసములు గాని యధావిధిగా వ్రతమును చేయవలయును.

విద్వాంసుడు ఈ ప్రకారము వ్రతమాచరించి, అయిదవ మాసములో ఉద్యాపనము చేయవలయును. అందు నిమిత్తమై తన శక్తి కొలదియు బంగారపు వినాయక ప్రతిమను చేయించవలయును.

అనంతరము పూజించువాడు, భక్తి కలవాడగుచు, పరిమళించుచున్న మంచి గంధముతోను, శుభప్రదములగు అనేక విధములగు పువ్వులతోను పూర్వము చెప్పబడిన ప్రకారముగా పూజచేయవలయును.

స్వస్తచిత్తుడై కొబ్బరి జలముతో అర్ఘ్యము ఇవ్వవలయును. అనంతరం చేటలు, పరమాన్నము ఫలములు మొదలగు వానితోగూడ ఎర్రని వస్త్రముతో చుట్బబడిన బంగారపు వినాయక ప్రతిమను దక్షిణ సహితముగా భక్తుడగు బ్రాహ్మణునకు వాయన మియ్యవలయును.

వ్రతము సంపూర్తినొందుటకు, తూమెడు నువ్వులను దానమియ్యవలయును. అనంతరము విఘ్నేశ్వరుడు సంతోషించుగాక యని క్షమార్పణగోరవలెను. 

ఈ ప్రకారము ఉద్యాపనము చేసిన ఎడల అశ్వమేధ యాగము (Ashwamedha Yagna) చేసిన ఫలము నొందును. మరియు మనస్సున కోరబడిన సమస్త కార్యములు సుఫలమగును. 

పూర్వకల్పంబున నేను చెప్పగా కుమార స్వామియు పార్వతీదేవియు నాలుగు మాసములు చేసిరి. ఇట్లు పార్వతియు, కుమారస్వామియు చేయగా చూచి, అగస్త్యుడు (Agastya) సముద్ర పానము చేయదలచినప్పుడు అయిదవ మాసము నందు ప్రారంభించినవాడై మూడు మాసములు చేయగా విఘ్నేశ్వరుని (Lord Vigneshwara) అనుగ్రహము కలవాడై సిద్ధి పొందెను. దమయంతి నలమహారాజును వెతుకునప్పుడు ఈ వ్రతం ఆరంభించి, ఆరు మాసములు చేయగా, విఘ్నేశ్వరుని అనుగ్రహం వలన తిరిగి భర్తను పొందెను.

అనిరుద్ధుని (Aniruddha) – చిత్రలేఖ, బాణాసురుని పట్టణమునకు తీసికొని వెళ్లినప్పుడు, తండ్రియగు మన్మధుడు – నా కుమారుని ఎవరు తీసుకొని వెళ్లిరో, ఎక్కడికి వెళ్లిరో అని విచార పడుచుండగా మన్మధుని తల్లియగు రుక్మిణీదేవి కుమారునితో ఇట్లు చెప్పుచున్నది.

ఓ పుత్రకా! నేను చేసిన వ్రత ప్రభావమును చెప్పెదను వినుము. నా గృహంబువ నీవు జన్మించినప్పుడు శంబరాసురుడు వచ్చి నిన్ను, బాలుడవైయుండగా ఎత్తుకొని పోయెను, అప్పుడు నీ వియోగముచే దుఃఖము వలన నా మనస్సు భేదింపబడెను. మిక్కిలి సుందరుడగు నా కుమారుని యొక్క ముఖమును ఎప్పుడు చూచెదనా.. యని విచారపడితిని.

ఇతర స్త్రీల యొక్క పుత్రులను జూడగా, వయస్సు చేతను గానీ, శరీర సౌందర్యము చేతనుగాని, నా కుమారుడు ఈ విధముగానే యుండునని నా మనస్సు పరితాపబడుచుండెను. ఇట్లు కొన్ని సంవత్సరములు వెళ్లగా, కొంత కాలమునకు దైవ యోగము వలన నా వద్దకు రోమశ మహాముని వచ్చెను. సమస్త చింతలను పోగొట్టునట్టి సంకష్ట చతుర్థీ (Sankashta Chaturthi) వ్రతమును ఆ రోమశ మునీశ్వరుడు నాకు చెప్పగా నేను నాలుగు పర్యాయములు యధావిధిగా చేసితిని.

అప్పుడు వినాయకుని అనుగ్రహము వలన, యుద్ధము నందు శంబరాసురుని నీవు సంహరించిన వాడవై తిరిగి మన గృహమునకు వచ్చితివి, కావున, నీవును ఈ వ్రత విధానము తెలిసికొనిన వాడవై, చేసిన ఎడల నీ కుమారుడు ఎక్కడ ఉన్నదియు నీవు తెలిసికొనగలవు.

ఇట్లు, రుక్మిణీ దేవి (Rukmini Devi) చెప్పగా, మన్మధుడు వినాయకునకు ప్రీతికరమగు సంకష్ట చతుర్థీ వ్రతము చేసెను. అప్పుడా వ్రత మహిమ వలన, నారదుడు వచ్చి బాణాసుర పట్టణము నందు అనిరుద్ధుండు కలడని చెప్పగా, మన్మధుడు బాణాసుర పట్టణమునకు వెళ్లి, ఆ బాణాసురునితోను, వానికి సహాయకారియైన సాంబమూర్తితో ఘోరమగు యుద్ధము చేసి, వారిని జయించి, కోడలితో సహితముగా అనిరుద్ధుని తీసుకొని వచ్చెను. మరియు, ఓ మునీశ్వరుడా! ఇతరులగు దేవతలు రాక్షసులు మొదలగువారు విఘ్నేశ్వరుని ప్రీతి కొరకు పూర్వము ఈ వ్రతము చేసిరి. 

కావున, దీనితో సమానమగునదియు, సమస్త కార్యసిద్ధులను చేయునట్టి వ్రతము మరియొకటి లేదు. తపస్సు గాని, దానము గాని, తీర్థము గాని దీనితో సమానమగునది లేదు.

దీని మహిమను గురించి విశేషముగా చెప్పనవసరము లేదు. కార్యసిద్ధిని చేయునట్టిది మరియొకటిలేదు. కావున, భక్తి లేనివానికిని, భగవంతుడు లేడనువానికిని, మూర్ఖునకును, ఈ వ్రతమును ఉపదేశింపగూడదు. కుమారునకును, శిష్యునకును శ్రద్ధ కలవానికిని, సత్పురుషునకు ఉపదేశింపవలయును.

బ్రహ్మ కుమారుడవగు ఓ మునీశ్వరుడా! నాకు ప్రియమగువాడవును, లోకములకు ఉపకారమగు కార్యములను చేయువాడవు కావున, ఈ వ్రతమును నీకు ఉపదేశించితినని సాంబమూర్తి సనత్కుమారునితో చెప్పెను.

♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే — “చతుర్థ్యాం సంకష్టహరణ వ్రత కథనం” నామ ద్వావింశోధ్యాయస్సమాప్తః.

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏

తదుపరి ఇరవై మూడవ అధ్యాయం >>

Also Read

Leave a Comment